సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడిపై అనిత ఫిర్యాదు

  • తన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారన్న అనిత
  • మార్ఫింగ్ వీడియోను సాక్షి ఛానల్ లో కూడా వేశారని మండిపాటు
  • జగన్ కు పరదాలు కప్పడానికేనా పోలీసులు ఉన్నది అని ప్రశ్న
వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేశారు. తన వ్యాఖ్యలను భార్గవ్ రెడ్డి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

చంద్రబాబును గద్దె దింపాలని, జగన్ ను సీఎం చేయాలని తాను అనలేదని... ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున ఈ మార్ఫింగ్ వీడియోను సాక్షి ఛానల్ లో కూడా ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్న సంగతి తెలిసిందే. 

వైసీపీ నేతలు విపక్ష నేతలను ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అనిత విమర్శించారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తమపై వైసీపీ శ్రేణులు ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కు పరదాలు కప్పడానికేనా పోలీసులు ఉన్నది? అని ఆమె ప్రశ్నించారు.

Anitha
Telugudesam
Sajjala Ramakrishna Reddy
Sajjala Bhargav Reddy
YSRCP

More Telugu News